Saturday, January 30, 2010

జై హో మహత్మా గాంధీ

మహాత్మా గాంధీ

మహాత్మా గాంధీ
పేరు : మహాత్మా గాంధీ.
తండ్రి పేరు : మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( మహాత్మా గాంధీ ).
తల్లి పేరు : పుత్లీబాయి.
పుట్టిన తేది : 2-10-1869.
పుట్టిన ప్రదేశం : పోరుబందర్.
చదివిన ప్రదేశం : లండన్.
చదువు : లాయర్.
గొప్పదనం : శాంతియుతంగా అనేక సత్యాగ్రహాలు చేసి భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు.
స్వర్గస్తుడైన తేది : 31-1-1948.

మహాత్మా గాంధీ గుజరాత్ లోని ఖయిత్వాద్ ప్రాంతంలోని పోరుబందర్ లో కరంచంద్ గాంధీ, పుత్లీబాయి దంపతులకు 1869వ సంవత్సరం అక్టోబర్ 2న జన్మించాడు. నీతి నిజాయితీలకు కట్టుబడిన కుటుంబంలో జన్మించిన గాంధీ చిన్నతనం నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరుగుతూ, తల్లి దండ్రుల యెడల గురువుల యెడల ఎంతో వినయ విధేయతలతో ఉంటూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. మోహన్ దాస్ కి పన్నెండవ సంవత్సరంలోనే కస్తుర్భాతో వివాహమయింది. అంత చిన్నతనంలో పెళ్ళిచేసుకోవటం అతనికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల మాట జవదాటలేక అంగీకరించాడు.వివాహ కారణంగా గాంధీ చదువు ఒక ఏడాది వృధా అయింది.

తండ్రి నుండే గాంధీ సుసంపన్నమైన జానపద కథలు, తమ ప్రాంత వైశిష్ట్యం తెలుసుకొన్నాడు. గుజరాతీయులకు 19వ శతాబ్ధం నుండి సముద్ర వాణిజ్య సంబంధాలుండేవి. పోరుబందర్ కు చెందిన ముస్లిం వర్తకులకు ఆ కుటుంబంబానికి సన్నిహిత సంబంధాలుండేవి. గాంధీకి దక్షిణాఫ్రికాకు వెళ్ళే అవకాశం కూడా ఆ సంబంధాలవల్లే లభించింది. కరంచంద్ గాంధీ వేర్వేరు సమయాల్లో పోరుబందర్, రాజ్ కోట్, వెంకనెర్ లకు ప్రధానమంత్రిగా పని చేసారు. గాంధీ గారి తాతయ్య, పెదనాన్న కూడా ఇవే పదవులు అలంకరించారు. ఇవన్నీ చిన్న చిన్న రాజ్యాలు. ఈ కుటుంబీకులెవరూ పెద్దగా ఆస్థి పాస్థులు వెనుకేసుకోలేదు. కరంచంద్ తండ్రి ఉత్తమ్ చంద్ ఒకసారి జునాగఢ్ నవాబుకు ఎడమ చేతితో సలాం చేశాడు. ఆగ్రహించిన నవాబు క్షమాపణ చెప్పమని ఆదేశించాడు. తన కుడి చేయి ఇప్పటికే పోరుబందర్ కు అంకితమైందని అందువల్లే ఎడమచేతితో అభివాదం చేశానని సమాధానమిచ్చాడు. గాంధీకి ఏడేళ్ళ వయస్సు వచ్చేనాటికి 120 మైళ్ళ దూరంలోని రాజ్ కోట్ కు కాపురం మారింది. పోరుబందర్ లోనే గాంధీ ప్రాథమిక విద్య పూర్తయింది. అక్కడి స్కూల్లో పిల్లలు నేలపైన కూర్చొని మట్టిపైన చేతివేళ్ళతో అక్షరాలు రాసుకొనేవారు. పాఠశాలలో గాంధీ సాధారణ విధ్యార్ధి. బిడియంగా, ఒంటరిగా వుండేవాడు. అయితే ఖయిత్వాద్ సంస్కృతి, కుటుంబ వాతావరణం బాల గాంధీ మనసుపై చెరగని ముద్ర వేశాయి. అతని వ్యక్తిత్వ రూపకల్పనలో సాయపడ్డాయి. ఖయిత్వాద్ లోని జైన సంస్కృతి ప్రభావం గాంధీపై అమితంగాపడింది.

గాంధీజీ తల్లి పుత్లీబాయి స్నేహశీలి, ధార్మికురాలు, మృదుభాషిణి. ఆ ఉమ్మడి కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకొనేది. ఆభరణాలంటే ఆమెకు అయిష్టం. దైవచింతన అధికం. నిత్యం పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తుండేది. ప్రేమమయమైన ఆమె వాత్సల్యం, దృఢచిత్తం, నిరాడంబరత మోహన్ దాస్ పై చెరగని ముద్రలు వేశాయి. "సన్యాసిని పోలిన ఆమె వ్యక్తిత్వం నా జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపించిందని" గాంధీజీ తన ఆత్మ కథలో తల్లి గురించి రాసుకున్నాడు. తండ్రి కరమ్‌చంద్ పెద్దగా చదువుకోకపోయినా వ్యవహారజ్ఞాని. "తన వారిని ప్రేమించేవాడు. సత్యనిష్టా గరిష్టుడూ, ధైర్యశాలి, వితరణశీలి." అని గాంధీజీ పేర్కొన్నాడు. ఆ ఇంట్లో ఎప్పుడూ రామాయణ, భారత పారాయణాలు జరుగుతుండేవి. ముస్లిం, జైన్ పార్శీ తదితర మతాలకు చెందిన మిత్రులతో కరంచంద్ నిత్యం మతపరమైన చర్చలు జరుపుతుండేవాడు.

ఆ ఇల్లు మత సామరస్యానికి నిలయంగా నిలిచేది. మోహన్ దాస్ కు ఆ విధంగా అన్ని మతాలపై గౌరవం, విభిన్న మతావలంబీకులపై సౌభ్రాతృత్వ భావం తండ్రి నుండి అబ్బింది. 1886లో కరంచంద్ కు తీవ్ర అనారోగ్యం ఆవరించింది. గాంధీ రాత్రి పొద్దుపోయేదాకా తండ్రికి సపర్యలు చేసేవాడు. కొద్దిరోజులకే తండ్రి చనిపోయాడు. తండ్రి మరణంతో ఆ కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. 1887 లో మెట్రిక్ పాస్ అయిన గాంధీ భావనగర్ కాలేజీలో ఉన్నత విద్యకై చేరాడు. అక్కడి వాతావరణము నచ్చలేదు. దీంతో ఇంటికి తిరుగు ముఖం పట్టాడు. ఇప్పుడేం చేయాలి? అన్నది ప్రశ్నార్ధకంగా తయారయింది. ఆ కులస్థుల కుటుంబాల్లో సముద్రయానం నిషిద్దం. ఆ కుటుంబానికి చిరకాల మిత్రుడైన యాదవ్ జీ ఇంగ్లాండు వెళ్ళి లా చదవమని చెప్పాడు. న్యాయశాస్త్రం అయితే ప్రధానమంత్రి కావచ్చని అదే వారి కుటుంబ వారసత్వాన్ని నిలుపుకొనే కోర్సు అని యాదవ్ జీ చెప్పాడు. తాత తండ్రుల్లా నీవు కూడా ప్రధానమంత్రి కావటం మంచిది అని చెబుతాడు.

అన్నయ్య ఊగిసలాటలు, తల్లి అభ్యంతరాలు, భార్య కన్నీళ్ళు, బంధుమిత్రుల ఆంక్షలు, వెక్కిరింతలు బెదిరింపులు గాంధీని ఇరకాటంలో పడవేశాయి. కులం కట్టుబాటు ప్రకారం సముద్ర ప్రయాణం చేయరాదు. గతంలో ఒకరు ఆ సాహసం చేస్తే పెద్దలు వెలేశారు. ఇదిలా వుంటే ఇంగ్లాండులో యువకులు మద్యం, మాంసం,మగువ విషయంలో విశృఖలంగా ప్రవర్తిస్తారనే ప్రచార మొకటి ఆ కుటుంబంలో అభ్యంతరానికి ప్రధాన హేతువైంది. చివరికి జైన ఆచార్యుని సమక్షంలో ఇంగ్లాండులో మాంసం, మద్యం, మగువలకు దూరంగా వుంటానికి గాంధీ తల్లికి ప్రమాణం చేశాడు. ఆర్ధికపరమైన ఏర్పాట్లను సోదరుడు తాను చూస్తానని వాగ్దానం చేశాడు. ఓడ ప్రయాణంలోనే గాంధీకి ఇబ్బందులు మొదలయ్యాయి. దుస్తులు, ఆహరపు అలవాట్లు, భాష అంతా కొత్తే. స్కూల్లో, కాలేజీల్లో చదివిన ఇంగ్లీషు స్థాయి చాలటంలేదు. ఇంగ్లాండులో వేసుకోదగ్గ దుస్తులయితే కుట్టించుకున్నాడు కానీ ఖయిత్వాద్ యువకుని బిడియ స్వభావం ఇంకామారలేదు. ఆహర పదార్థాలలో ఏది మాంసాహరమో, ఏది శాఖాహరమో అడగాలంటే బిడియం. అందువల్ల తన క్యాబిన్ లోనే భుజించేవాడు. పళ్ళూ, తీపి పదార్ధాలనే తినేవాడు.అనేక మానసిక వత్తిళ్ళ మధ్య, తల్లికిచ్చిన వాగ్ధానం నిలుపుకొనే ఆత్మస్థయిర్యం ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ ప్రయాణం కొనసాగించాడు. జునాగఢ్ కు చెందిన వకీలు ముంజుదార్ తనతోనే ప్రయాణం చేస్తున్నాడు. లాయర్లు పెద్ద నోరు కల్గి వుండాలని అందువల్ల భయం వీడి ఇంగ్లీషులో మాట్లాడడం అలవాటు చేసుకోమని అతను గాంధీకి సలహా ఇచ్చేవాడు.

సాల్డ్ రాసిన "ఫ్లీఫర్ వెజిటేరియనిజం" అనే పుస్తకం గాంధీని బాగా ఆకట్టుకొంది. "శాఖాహరం తీసుకోవటంవల్ల ఆర్ధిక, నైతిక పరమైన లాభాల్ని పొందుతాం ఇది సంపూర్ణాహరం. శాఖాహరుల్లో 90 శాతం మంది మద్యానికి దూరంగా వుంటారు. అందువల్ల ఆహరపు అలవాట్లలో సంస్కరణ మద్యం నిషేధానికి ఊతమిస్తుంది. సాల్డ్ ను గాంధీ ఎప్పుడూ కలుసుకోలేదు. అయితే ఆయన రచనల ప్రభావం గాంధీ వ్యక్తిత్వంపై, అలవాట్లపై ఎంతగానో పడింది. శాఖాహర జీవన విధానం ప్రచారకుల్లో మరో ముఖ్యరచయిత అయిన హోలార్డ్ విలియం గాంధీ ని కలిసాడు. పైథాగరస్, ఏసు క్రీస్తు దగ్గర్నుండి నేటి వరకు ఎక్కువమంది తత్వవేత్తలు, ప్రవక్తలు శాఖాహరులే నని విలియంస్ పేర్కొన్నాడు. మద్యం ఖరీదు ఆహరం ఖర్చు కన్నా అధికమని తొలిసారి త్తెలుసుకున్న గాంధీ ఆశ్చర్య పోయాడు. మద్యం కోసం ఎందుకలా డబ్బును వెదజల్లుతారో అర్ధంకాలేదు.

భారతీయులు స్వదేశంలో జరుపుతున్న ఉద్యమానికి బ్రిటన్ లో మద్దతిస్తూ కొన్ని కార్యక్రమాల్ని తొలిసారిగా ఇక్కడి పార్లమెంటు సభ్యులు చేపట్టారు. ఎడ్మండ్ బర్క్, జాన్ బ్రైటో లాంటి వారు వీరిలో ముఖ్యులు. ఇండియన్ పార్లమెంటరీ కమిటీని పునఃప్రారంభించారు. ఇంగ్లాండు పార్లమెంటులో సభ్యుడైన దాదాబాయి నౌరోజి ఈ కమిటిలో ఉన్నాడు. 1892 ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండేళ్ళ క్రితం నుండే నౌరోజి ప్రచారం ప్రారంభించాడు. ఈ ప్రచార సభలకు హజరైన గాంధీ దాదాభాయి ఉపన్యాసాన్ని ఏకాగ్రతతో వినేవాడు. పార్లమెంటరీ కమిటీ 1890 ఫిబ్రవరిలో "ఇండియా" పత్రికను ప్రారంభించింది. తర్వాత కాలంలో ఈ పత్రికకు గాంధీ జోహన్స్ బర్గ్ విలేఖరిగా వార్తలు పంపాడు. భారతదేశంలో ప్రజల సమస్యల్ని ఈ పత్రిక వివరించి బ్రిటన్ లో స్థానికుల సానుభూతి కోసం పాటు పడింది. ఇంగ్లాండు వచ్చాకే రోజూ వార్తా పత్రికలు చదివే అలవాటు గాంధీకి అబ్బింది.

మేడం బ్లావట్ స్కీ రాసిన "కీ టు థియొసఫీ" చదివాడు. అయితే ఈ సొసైటీలో చేరవలసిందిగా వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించాడు. బైబిల్ లోని "సెర్మన్ ఆన్ ద మౌంట్" గాంధీని బాగా ఆకట్టుకుంది. ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపమని, అందర్నీ ప్రేమించాలని, తోటివారికి ఉపకారం చెయ్యాలన్న క్రీస్తు బోధనలు బాగా ఆకట్టుకున్నాయి. మహమ్మద్ ప్రవక్త జీవితంపై కూడా అధ్యయనం చేశాడు. ప్రవక్తలో ధైర్యం, గొప్పదనం, నిరాడంబరత గాంధీకి వచ్చాయి. యువగాంధీకి అన్ని మతాల సారాన్ని పారద్రోలాలన్న కోర్కె బలపడింది. 1888 నవంబరులో 'ఇన్నర్ టెంపుల్' లో లా అధ్యయనం కోసం చేరాడు. లండన్ విశ్వవిద్యాలయంలో 1890 లో మెట్రిక్ పూర్తి చేశాడు. ప్రెంచ్, లాటిన్, ఫిజిక్స్, సాధారణన్యాయం, రోమన్ చట్టం వంటి అనేక పుస్తకాలు కొని కఠోర శ్రమ చేసి న్యాయవాదిగా డిగ్రీ పూర్తి చేశాడు.

తన దేశం పాశ్చాత్యుల చేతుల్లో పడినందువలన భారతీయులు మరీ దీనావస్థలో పడిపోయారని వాపోయేవాడు. ఏదో వ్యాపారం చేయడానికి భారతదేశం వచ్చిన పాశ్చాత్యులు భారతీయుల మంచితనాన్నిఆసరాగా తీసుకొని శాశ్వతంగా స్థిరపడిపోయి మన సంస్కృతిని, సాంప్రదాయాలను మంటగలుపుతూ, దేశంలోని అపార సంపదలను కొల్లగొడ్తూ వాటిని తమ దేశాలకు తరలిస్తునారని, వారిని వెళ్ళగొడితేనే గాని మనశ్శాంతి ఉండదని తన స్నేహితులతో అనేవాడు. 1901లో గాంధీ భారతదేశంను సందర్శించారు. కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సభలకు హజరయ్యడు.1904లో "ఇండియన్ ఒపీనియన్" పత్రిక బాధ్యతను స్వీకరించి తమ ఉద్యమం కోసం దాన్ని మలుచుకున్న గాంధీ భారతీయుల పోరాట విధానానికి మంచి పేరు సూచించమని పాఠకులను కోరుతూ ప్రకటన చేశాడు. గాంధీ బంధువొకరు "సదాగ్రహ" అనే పేరును సూచించాడు. గాంధీ దాన్ని కొద్దిగా మార్పు చేసి "సత్యాగ్రహం" అని నామకరణం చేశాడు.

1906 జులై నుండి గాంధీ బ్రహ్మచర్య వ్రతాన్ని చేపట్టాడు. జీవితాంతం దీన్ని కొనసాగించాడు. కట్టుబాట్లను ధిక్కరించి సముద్రాయానం చేసి వచ్చిన గాంధీపై కుల పెద్దలకు కోపం పోలేదు. కులస్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం శాంతిస్తే మరో వర్గం ఇంకా ఆగ్రహంతోనే వుంది. వారిని శాంతింప జేయుట కోసం అన్నయ్య మాట కాదనలేక నాసిక్ వెళ్ళి పుణ్యస్నాన మాచరించాడు. గాంధీ ఇదంతా చూశాక కులకట్టుబాట్లు, చాందసపు విధానాలపై గాంధీకి నిరసన భావం కలిగింది. 1860 ప్రాంతంలో టీ, కాఫీ,చెరుకు తోటల్లో పని చేయటానికి భారతీయ కార్మికుల్ని తొలిసారిగా దక్షిణ ఆఫ్రికాకు తీసుకొచ్చారు. 1890 నాటికి 40 వేల మంది కార్మికులు వచ్చారు. వీరంతా అర్ధ బానిసలుగా జీవితాల్ని గడుపుతున్నారు. కాంట్రాక్టు కార్మికుల తరహలో వీరి జీవితం సాగుతున్నది. క్రమంగా వ్యాపారాలు చేసుకునేందుకు వచ్చి అనేకులు స్థిర పడ్డారు. భారతీయుల మీద ప్రభుత్వం అనేక రకాల ప్రత్యేక చట్టాలు చేసింది. పన్నులు విధించారు. నిబంధనలు, నిషేధాలు చేశారు. స్థానిక శ్వేత జాతీయులు వీరిని హీనంగా చూసేవారు. భారతీయుల్ని కూలీలనేవారు. ఈ అనాగరిక మనస్తత్వాన్ని, నల్లవారి చట్టాల్ని ధిక్కరించాలని గాంధీ నిర్ణయించుకొన్నాడు. మనుషులందరూ సమానమే, అందరికీ ఒకటే న్యాయం, చట్టం ఉండాలి. పాలకులు చేస్తున్న అన్యాయపు పోకడల్ని ఎదిరించాలి.

ఈ ఉద్దేశంతో ప్రిటోరియాలో నివశిస్తున్న భారతీయులతో ఒక సమావేశాన్ని గాంధీ ఏర్పాటు చేశాడు. తమ కష్ట నష్టాల గురించి ప్రభుత్వానికి తెలియజెప్పాలి. భారతీయుల హక్కుల పరిరక్షణ కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గాంధీ తన తొలి ఉపన్యాసంలో "వ్యాపారులలో సత్య సంథత అవసరం. మనం విదేశంలో గడిపేటప్పుడు ముఖ్యంగా మన ప్రవర్తన మరింత సత్య నిష్టతో కూడినదై వుండాలి. మనల్ని చూసి భారతీయులంతా ఇంతే అనే ముద్ర పడుతుంది. దక్షిణ ఆఫ్రికాలో నివశిస్తున్న హిందూ, సిక్కు, ముస్లిం, జైన, క్రైస్తవ తదితర మతావలంబకులు మద్రాస్, సింధు, పంజాబు ... లాంటి వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన వారు సామరస్యంతో సహజీవనం గడపటం అలవర్చుకోవటం అత్యంత ముఖ్యమైన తక్షణ కర్తవ్యం" అని గాంధీ ఉద్బోధించాడు. ఇంగ్లీషు భాష రాని భారతీయులకు భోధించేందుకు సందిగ్దత వ్యక్త పరిచాడు.

బొంబాయి ప్రెసిడెన్సీలోని బౌదా నుండి వచ్చిన పిలుపుమేరకు వెంటనే అక్కడికి చేరుకున్నాడు. కరువు పరిస్థితుల వల్ల శిస్తు కట్టలేని స్థితిలో వున్న రైతులు ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు ఇక్కడ తల్లడిల్లి పోతున్నారు. ప్రభుత్వం అంటేనే రైతులకు భయం ఏర్పడింది. గాంధీ, వల్లభాయ్ పటేల్ కలిసి గ్రామాలు తిరిగి సత్యాగ్రహ సైనికులను తయారు చేశారు. ప్రభుత్వం దీనికి జవాబుగా అన్నట్లు కఠినంగా పన్నుల వసూళ్ళు మొదలు పెట్టింది. కట్టని వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నది. గాందీ నాయకత్వంలో రైతులు దీన్ని శాంతి యుతంగా వ్యతిరేకించారు. సహయ నిరాకరణ చేశారు. చివరికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. శిస్తులు కట్టలేని పేదల్ని వత్తిడి చేయవద్దని ఆదేశాలు వెలువడ్డాయి. రైతులు ఈ వివాదం మీద విజయం సాధించారు. ఎన్నో ఆలోచనలతో నిమగ్నమై వున్న గాంధీజీ బిర్లా మందిరం వద్ద ప్రార్ధన సమావేసంలో వుండగా 1948 జనవరి 20 న బాంబు పేలుడు జరిగింది. ఈ సంఘటన తప్పు దారి పట్టిన యువత చర్యగా మహత్ముడు వ్యాఖ్యానించాడు. మదనలాల్ అనే పంజాబ్ నుండి వచ్చిన శరణాధిని ఈ సందర్భంగా అరెస్టు చేశారు. గాంధీజీ హిందువుల ప్రయోజనాలకు భంగకరంగా తయారయ్యాడనేది కొందరి భావన.

27న దర్గా షరీఫ్ ను దర్శించాడు. గాంధీజీ హిందువులు, ముస్లింలు కలసి కట్టుగా ఉరుసు జరుపుకోవటం పట్ల ఆనందం ప్రకటించాడు. 30వ తేదీన కాంగ్రెస్ భవితపై ఒక డ్రాప్టును టైపు చేయించాడు. కాంగ్రెస్ ను రద్దు చేసి "లోక్ సేవక్ సంఘ్" ను ఏర్పాటు చేయాలని, ఈ అంశం పై చర్చ జరపాలని బాపూజీ అభిలషించాడు.సర్థార్ పటేల్ తో చర్చలు జరిపి సాయంత్రం వేళ బిర్లామందిరంలో ప్రార్ధనా సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న గాంధీజీపై, నాధూరం వినాయక్ గాడ్సెతో అనే హిందూ మతతత్వ వాది తుపాకితో కాల్పులు జరిపాడు." "హేరాం" అంటూ మహత్ముడు నేల కొరిగాడు. అంతకు ముందు బాంబు దాడి జరిగినప్పుడూ ప్రభుత్వము ప్రత్యేక రక్షణ కల్పిస్తానంటే గాంధీజీ అంగీకరించలేదు. సందర్శకుల్ని తనికీ చేసేందుకు కూడా ఒప్పుకోలేదు. వైరిని కూడ ప్రేమించే మహత్ముడు ద్వేషానికి బలయ్యాడు. ఈ వార్త వినగానే దేశ ప్రజలే కాదు, ప్రపంచమంతా నివ్వేరపోయింది. అనేక మంది అశేష అశ్రుతప్త హృదయాలతో కదలిరాగా అంతిమయాత్ర జరిగింది.

1920 డిసెంబరులో నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశం సహాయ నిరాకరణ ఉధ్యమానికి అంగీకారం తెలిపింది. భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీ యుగం ప్రారంభమయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీని మహాత్ముడుగా సంభోదించాడు. 1930 ఫిబ్రవరి 15న అహ్మదాబాద్ లో ఉప్పుసత్యాగ్రహం జరిగింది. గాంధీజీ మానవతావదం, ఓర్పు, శాంతి, అహింసా సిద్దాంతాల గురించి ప్రపంచమంతా ప్రచారమయింది. అంతకుముందెన్నడు ఏ రాజకీయనాయకుడు అవలంభించని "అహింసావాదం" ప్రపంచంలోని ప్రజలందరినీ ఆశ్చర్యపరిచింది. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో కూడా గాంధీ తన అద్భుత అస్త్రం "అహింస" ద్వారానే తెల్లదొరల కఠిన హృదయాలను కరిగింపచేయగలిగారు. మహిమలు లేకపోయినా, తను నమ్ముకున్న బాట అయిన "అహింస" ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసి "మహాత్ముడిగా" గుర్తింపు పొందిన మహాత్మాగాంధీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.

Wednesday, January 13, 2010

భోగి పండుగ--విశేషాలు


చాంద్రమానం పాటించే తెలుగువారు సౌరమానం ప్రకారం జరిపే పర్వాలలో భోగి ఒకటి. తెలుగువారి ఇతర పండుగలవలె ఇది తిథి ప్రధానమైన పర్వం కాదు.ఈ పండుగ దక్షిణాయనానికి ఆఖరురోజు,అలాగే ధనుర్మాసానికి కూడా చివరి రోజు.

రైతులకు పంటలన్నీ ఈ పండుగ నాటికి దాదాపు ఇంటికి వచ్చేస్తాయి.రైతులకు వ్యవసాయ పనుల రద్దీ తగ్గి సుఖంగా కాలక్షేపం చేయడానికి కావలసిన విశ్రాంతి దొరుకుతుంది.చేతికొచ్చిన పంటను అనుభవానికి తెచ్చుకుని భోగభాగ్యాలు అనుభవించడానికి రైతులకు వీలుకలిగించే పండుగ కాబట్టి దీనికి భోగి అని వచ్చిందేమో ! భోగికి ఆ పేరు రావడానికి ఇంకో విధంగా గూడా చెబుతారు. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూర్ లో విష్ణుచిత్తుడు అనే పరమ భాగవతోత్తముడు, ఆయనకు తులసివనంలో లభించిన గోదాదేవి అనే కూతురు.గోదాదేవి శ్రీరంగంలోని శ్రీరంగనాథున్ని తప్ప మానవమాత్రులెవరినీ వివాహం చేసుకోనని తండ్రితో చెప్పింది.

తన కోరికను నెరవర్చుకోవడానికి ద్వాపరంలో శ్రీకృష్ణుణ్ణి పొందడానికి గోపికలు నోచిన కాత్యాయనీ వ్రతం మాదిరి తను కూడా చేయప్రారంభిస్తుంది.ఆమె రోజుకొక పాశురంతో(పద్యం) స్వామిని అర్చించేది.తర్వాత నివేదన చేసేది.ఆ మాసం రోజులు నెయ్యిని,పాలను వర్జించి పొంగలిని మాత్రమే స్వీకరించేది.అలా నెలరోజులు ముప్పై పాశురాలతో అర్చించింది. ఆ ముప్పై పాశురాల గ్రంథామే "తిరుప్పావై" .

తిరుప్పావై రచన పూర్తి అయిన ముప్పైయ్యవనాడు శ్రీ రంగనాథుడు ప్రత్యక్షమై ఆమెను తప్పక వివాహం చేసుకుంటానని ఆమెకు మాట ఇస్తాడు.శ్రీరంగం రావలసినదని ఆహ్వానిస్తాడు. గోదాదేవి తనకు భగవంతుడు చెప్పిన మాటను తండ్రికి చెప్పి తండ్రితో శ్రీరంగం చేరుకుంటుంది. అశేష ప్రజానీక సమక్షంలో ఆమెను శ్రీ రంగనాథునకిచ్చి వివాహం జరిపిస్తారు. వివాహ కార్యక్రమం పూర్తికాగానే ఆమె గర్భాలయంలోకి వెళ్ళి స్వామి వారి శేషతల్పం ఎక్కి స్వామివారి పాదాలు సమీపించి స్వామివారిలో ఐక్యమవుతుంది.

ఇంతటి మహిమగల విషయం జరిగిన పుణ్యదినం ,పండుగదినం భోగి. గోదాదేవికి అంతటి భోగభాగ్యం కూర్చిన ఆనాడు అప్పటినుంచి జనసామాన్యానికి కూడా సమస్త భోగభాగ్యాలు ఇచ్చేరోజు భోగి పండుగ అయింది.

వామనమూర్తి పాదాల క్రింద బలి చక్రవర్తి అణగిన దినంగా కొందరు చెబుతారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో వామన నామ స్మరణము,బలి చక్రవర్తి ప్రస్తుతి చేయడం ఆచారంగా ఉంది.

భోగినాడు తెల్లవారుఝామునే చేచి, అభ్యంగన స్నానం చేయాలి. చంటిపిల్లలకు భోగిపీడ తొలగడానికి కేవలం తలంటుతోనే గాక మధ్యాహ్నం భోగిపళ్ళు కూడా పోస్తారు.ఈ భోగిపళ్ళు పోయడమన్నది పిల్లలకు దృష్టి పరిహారార్థం చేసే కర్మగా కనిపిస్తుంది.

చిన్నపిల్లలకు కొత్తబట్టలు తొడిగి పీట మీద కూర్చోబెడతారు.రేగుపళ్ళు, పైసలు,చెరకు ముక్కలు, బంతిపూలు కలిపి తలమీదనుంచి పోస్తారు.ఇలా చేయడంవల్ల ఆ పిల్లలకు ఆయుర్వృద్దికరమై ఉంటుందని తెలుగు తల్లుల నమ్మిక.
భోగినాడు తెల్లవారుఝామునే భోగిమంటలు వేస్తారు.ఈ భోగిమంటల్లో ధనుర్మాసం నెలరోజులు ఆడపిల్లలు ముగ్గుల్లో పెట్టిన గొబ్బెమ్మలను,ఇంటిలోని పనికిరాని వస్తువులను వేస్తారు.

Thursday, January 7, 2010

జీవితం అసంతృప్తిగా వుందా?



.




ఇంతకంటే సంతోషకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం










మనల్ని పలకరించేవారు కనీసం ఒకరిద్దరైనా ఉన్నారు.











మన రోడ్లు ఇంత అధ్వాన్నంగా అయితే లేవు.











మన జీవితం ఈ అవ్వ కంటే దారుణంగా అయితే లేదు కదా?


మరి మనం ఎంత అదృష్టవంతులం?

ముఖ్య అనుభందం:
http://jeevani2009.blogspot.com