Thursday, September 24, 2009

నాటు వైద్యమా? నేటి వైద్యమా?

బ్లాగ్: కృష్ణాజిల్లా చల్లపల్లిలోని ప్రముఖ వైద్యులు డా. డి.ఆర్.కె.ప్రసాద్ కాముకాటుకు నేటివైద్యమే సత్ఫలితాన్ని ఇస్తుందని చెబుతున్నారు. ఆయన ప్రజలకు శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు విశేషరీతిలో కృషిసల్పారు. 1989 నుంచి నేటివరకూ రెండు దశాబ్దాలుగా పాముకాటు వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్న నిరంతర శ్రామికుడాయన. కరపత్రాలు, పుస్తకాల ద్వారా ప్రజలను కొంతమేర చైతన్యవంతులను చేశారు. విద్యార్థులకు లాప్ టాప్ కంప్యూటర్ల ద్వారా ఎన్నో అవగాహనా సదస్సులను నిర్వహించిన ఆయన ఈ క్రమంలో కొంతమేర కృతకృత్యులయ్యారు. పాముకాటు కారణంగా అత్యంత విలువైన జీవితాన్ని మనిషి కోల్పోరాదనే ఉద్దేశంతో విలువైన కాలాన్ని సైతం లెక్కచేయక పాముకాటుకు నాటు వైద్యమా... నేటి వైద్యమా అని అనుభవాలనూ, గుణపాఠాలనూ తాను రచించిన పుస్తకం ద్వారా ప్రజలకు తెలియచెప్పిన ప్రముఖ వైద్యులు .ప్రసాద్. ప్రతి జబ్బు వైద్యానికీ ప్రొటోకాల్ ఉన్నట్లుగానే పాముకాటు వైద్యానికి ప్రొటోకాల్ ను తయారుచేయటంలో డి.ఆర్.కె ప్రముఖ పాత్ర పోషించారు. పాముకాటుకు గురైనవారిలో అధికశాతం మందిని ప్రాణాలతో బతికించవచ్చనీ, పాముకాటుపై ప్రజలకు అవగాహన తప్పనిసరనీ పేర్కొనే డా.డి.ఆర్.కె.ప్రసాద్ పాముల్లో రకాలు, కాటు ప్రభావం, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సవివరంగా వివరించారు.
పాముల్లో రకాలు - విషసర్పాలు...
ప్రపంచంలో మూడువేల రకాల పాములుండగా, వాటిలో 250 రకాలు విషసర్పాలు ఉన్నాయి. మనదేశంలో తాచుపాము, కట్లపాము, రక్తపింజర, సాస్కేల్డ్ వైపర్ (పుర్సా), హంప్ నోసెడ్ పిట్ వైపర్ ఐదురకాలే విషపూరితమైనవి. పాముకాటుల్లో సుమారు 30 నుంచీ 50 శాతం సరిగ్గా విషమెక్కని ఉత్తుత్తి కాటులే. విషపుపాము కరిచిన రోగినైనా అరగంట నుంచి గంటలోపు ఆసుపత్రికి తీసుకువెళ్తే నూటికి 90 మందిని బతికించవచ్చు. పాముకాటు వల్ల శరీరంలోకి విషం ఎక్కితే యాంటీ స్నేక్ వీనమ్ తో తప్ప మరేవైద్యం వల్లా బతికే అవకాశం లేదు.
పాముకరిచిన సమయంలో విషలక్షణాలు...
త్రాచు, కట్లపాముల్లోని విషం న్యూరోటాక్సిన్ ఎక్కితే కళ్ళు మూతలుబడతాయి. గుండె బరువుగా అనిపిస్తుంది. వాంతికాబోతున్నట్లుగా అనిపించి వాంతి అవుతుంది. ఒక్క మనిషే ఇద్దరుగా కనిపించటం, కాళ్ళు, చేతులు కొట్టుకోవటం, శ్వాసకండరాలు పనిచేయక ఊపిరాగిపోవటం, గుండెకొట్టుకోవడం ఆగి, కొద్ది నిముషాల్లో మెదడు పనిచేయకపోవటం జరుగుతుంది. రక్తపింజర విషం ఎక్కితే శరీరభాగం వాయటంతోపాటు గజ్జల్లో, చంకల్లో బిళ్ళలు కట్టి భరించరాని నొప్పి వస్తుంది. శరీరంలోని ఏ భాగంలో నుంచైనా రక్తస్రావం జరుగుతుంది.
పాముకరిస్తే చేయాల్సిన పనులు...
కరిచింది ఏ పామో వీలైతే గుర్తించాలి, రోగికి ధైర్యం చెప్పాలి. పాము విషానికి విరుగుడు ఇంజక్షన్లు ఉన్నాయనీ, ప్రమాదం నుంచి బయటపడతామనే ధీమాను రోగికి కల్పించాలి. కరిచిన చోటుకు పైభాగంలో గుడ్డముక్కతో సుమారుగా బిగించికట్టాలి. రోగిని నడిపించకుండా సైకిల్, స్కూటర్ లపై సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. నోటిద్వారా ఎటువంటి ఆహారాన్ని ఇవ్వరాదు. నాట్లు, పసరు, మంత్రాలతో కాలయాపన చేయరాదు. కంట్లో కలికం, నోట్లో పసరు పోయటం ద్వారా విష ప్రభావం తెలుసుకోవటంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
డాక్టర్ చేయాల్సిన వైద్యం...
రోగికి ధైర్యం నూరిపోస్తూ చికిత్స ప్రారంభించాలి. ఆహారమేమీ ఇవ్వకుండా సెలైన్ ఎక్కించాలి. ధనుర్వాతం రాకుండా ముందు జాగ్రత్తగా టెట్వాక్ ఇంజక్షన్ ఇవ్వాలి. రోగిని పరిశీలిస్తూ విష ప్రభావం కనిపించినపుడు ఏ ఎస్ వీ ఇంజక్షన్లు చేయాలి. విష లక్షణాలు కనిపించకపోతే 24 గంటల తర్వాత రోగిని పంపించివేయచ్చు. త్రాచు, కట్లపాము కాట్లతో శ్వాస ఆగినప్పుడు రోగికి యాంబుబ్యాగ్ తో కృత్రిమ శ్వాస ఏర్పాటు చేయాలి. పాము కాటుకు ఎక్కువ సందర్భాల్లో 5 నుంచీ 10 వరకు యాంటీ స్నేక్ వీనమ్ ఇంజక్షన్లు చేయాల్సి ఉంటుంది. వీటికి దాదాపు నాలుగువేల రూపాయలు ఖర్చవుతాయి. పాముకాటుకు గురయ్యేవారిలో అధికభాగం కూలీలే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఏ ఎస్ విలు ఉంచాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

చిన్నపార్టీలకు దెబ్బ


బ్లాగ్: జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ వార్డులకు జరిగిన ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు రాష్ట్రంలోని చిన్న, చితక పార్టీలన్నిటినీ ఘోరంగా దెబ్బ తీశాయి. ఎప్పటిలాగానే రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మాత్రమే ముఖాముఖి పోటికి తలపడిన సత్తా ఉన్న పార్టీలుగా మనగలిగే పరిస్థితులు వచ్చాయి. రాష్ట్రంలో చూసుకుంటే ప్రజారాజ్యం పార్టీ, ప్రాంతీయంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి కోలుకోలేనంత దెబ్బతిన్నట్టు ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ ప్రభంజనాన్ని కొద్దో గొప్పో అయినా ఎదుర్కోగలిగిన స్థాయి ఆ పార్టీకి మిగిలి ఉందని రుజువైంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టిడిపి తన బలాన్ని రెట్టింపు చేసుకోగలిగింది. ప్రజారాజ్యం, టిఆర్‌ఎస్‌ కాస్త గౌరవప్రదమైన సీట్లనైనా గెలుచుకోగలిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వందరోజులు దాటి కొద్ది రోజులైనా గడవక ముందే ఆ పార్టీలు తమ అభ్యర్ధులను గెలిపించుకోవటంలో దారుణంగా విఫలమయ్యాయి. వైఎస్ మరణం, ఇతర అంశాలు, స్థానిక సమీకరణల ఫలితంగా ఆశించిన ఫలితాలు రాలేదని చెప్పుకుంటూ ఆయా పార్టీలు కాలం గడిపినప్పటికీ, జనామోదం పొందగలిగిన బలాన్ని కూడగట్టటంలో విఫలమయ్యాయన్న విషయాన్ని అంతర్గతంగా అంగీకరిస్తున్నాయి. ఈసారి 19 జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 15 కాంగ్రెస్ కు రాగా, టిడిపికి 4 స్థానాలు దక్కించుకున్నాయి. అలాగే 17 ఎంపీటీసీలలో కాంగ్రెస్ 12, టిడిపి 2, ఇతరులు 3 స్థానాలు గెలుచుకొన్నారు. మున్సిపల్ వార్డులకు జరిగిన ఎన్నికల్లో 20 స్థానాలకు కాంగ్రెస్ 8, టిడిపి 8, సిపిఐ, ఇండిపెండెంట్ చెరో స్థానం, పీఆర్పీ 1 స్థానం గెలుచుకొన్నాయి. ఉద్యమ పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని చెబుతున్న టిఆర్‌ఎస్‌ కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నది. టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్ తనయుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కె. తారకరామారావు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తూ, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన ఎల్లారెడ్డి జడ్పీటీసీ కాంగ్రెస్ వశమైంది. సార్వత్రిక ఎన్నికల్లోనే కాక, ఈ ఎన్నికల్లో చూసినా చిన్న పార్టీల పరిమితి కేవలం ప్రధాన పక్షాల అభ్యర్ధుల గెలుపు ఓటములను తారుమారు చేసేవరకే అని తేలిపోయింది.
సార్వత్రిక ఎన్నికల్లో 70 లక్షల ఓట్లు, 18 సీట్లు గెలుచుకున్నామని పీఆర్పీ అధినేత చిరంజీవి అవకాశం చిక్కినప్పుడల్లా ఘనంగా చెప్పుకుంటారు. క్రమంగా ఆ పరిస్థితి మారిపోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలు జరిగితే స్థానికంగా పట్టు ఉన్న వారికి మాత్రమే అవకాశం చిక్కుతుంది. అలాంటివారు పీఆర్పీలో కనిపించారు.ఇక టిఆర్‌ఎస్‌ పరిస్థితి దయనీయంగా మారింది. గులాబీ కండువా కప్పుకుని తిరిగేందుకు తప్ప ఎన్నికల్లో ప్రభావితం చేయగలిగిన నాయకులంటూ కనిపించరు. అటు జిల్లాల్లోనూ, ఇటు గ్రేటర్ పరిధిలోనూ అదే పరిస్థితి. ఈసారి గ్రేటర్ లో అన్ని డివిజన్లకూ పోటీ చేస్తామంటున్నా, అది నెరవేరేట్లు కనపడటంలేదు. అంతో ఇంతో బలం ఉన్న పీఆర్పీ, టిఆర్‌ఎస్‌ లాంటి పార్టీలే ఉనికి కోసం పాకులాడే దుస్థితిలో పడిపోయిన నేపథ్యంలో నిష్కళంకమైన రాజకీయాల నినాదంతో రాజకీయ ప్రవేశం చేసిన లోక్‌సత్తా పార్టీ మరీ గందరగోళంగా ఉంది. ఇటీవలి టెక్కలి శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆ పార్టీ పట్టుమని 1500 ఓట్లు సాధించలేకపోయింది. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆకర్ష, స్వగృహ ప్రయోగాలకు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ చిన్నా, చితకా పార్టీల పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించటంలేదు.

మీ నెంబర్ మీకే


న్యూఢిల్లీ: 'టాటా నుంచి వొడాఫోన్ కు మారాను. ఇది నా కొత్త నెంబర్. సేవ్ చేసుకో!' ఈ తరహా కష్టాలకు అతి త్వరలో తెరపడనుంది. సర్వీస్ ఆపరేటర్ ను మార్చేసినా పాత సెల్ ఫోన్ నెంబర్ నే కొనసాగించుకునే అవకాశం డిసెంబర్ నుంచి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి మెట్రో నగరాలు, సర్వీస్ 'ఏ' కేటగిరీ ప్రాంతాల సెల్ వినియోగదారులకు ఈ సౌలభ్యం లభిస్తుంది. వచ్చే ఏడాది మార్చి నుంచి దేశ వ్యాప్తంగా 'మొబైల్ నంబర్ పోర్టబులిటీ' విధానం అమలులోకి వస్తుందని టెలికాం నియంత్రణ సంస్థ....ట్రాయ్ ప్రకటించింది. 'టెలీ కమ్యూనికేషన్ మొబైల్ నెంబర్ పోర్టబులిటీ విధానం, 2009' ను విడుదల చేసింది. ఇందులో ఒక కనెక్షన్ యాక్టివేట్ అయిన 90 రోజుల తర్వాతే పోర్టబులిటీ అవకాశం లభిస్తుందని, అలాగే...ఒకసారి పోర్టబులిటీ సదుపాయం ఉపయోగించుకున్న తర్వాత కనీసం 90 రోజులపాటు అదే ఆపరేటర్ తో కొనసాగాలని, పోర్టబులిటీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకున్నట్లు కొత్త ఆపరేటర్ కు తెలియచేయాలని, పాతనెంబర్ తెలుపుతూ దానిని కొనసాగించాలని కోరాలని, పోర్టబులిటీ సదుపాయం ఉపయోగించుకునే వినియోగదారులు పాత ఆపరేటర్ కు బిల్లు మొత్తం బకాయి లేకుండా చెల్లించాలని, పోర్టబులిటీ రుసుమును ఇంకా నిర్ణయించలేదని తెలిపింది. 'లోకల్ కాల్స్, ఎస్ ఎంఎస్ ల ప్యాకేజీ బాగుంది కానీ ఎస్ టీ డీ, ఐ ఎస్ డీ కాల్స్' చేయాలంటే మాత్రం తడిసి మోపెడవుతోంది. ఇలాంటి సమస్యలకు కూడా ట్రాయ్ ఓ పరిష్కారం కనుగొంది. మనం ఏ ఆపరేటర్ సేవలు పొందుతున్నా ఎస్ టీ డీ, ఐ ఎస్ డీ కాల్స్ కోసం మాత్రం మనకు నచ్చిన ఆపరేటర్ ను ఎంచుకోవచ్చు. దీనికోసం అందరు ఆపరేటర్లు పరిమిత కాలపు ఆఫర్ తో ప్రీపెయిడ్ కాలింగ్ కార్డ్స్ అందుబాటులోకి తేవాలని ట్రాయ్ సూచించింది. ట్రాయ్ కొత్త సిపారసు వల్ల ఆపరేటర్ల మధ్య పోటీ పెరిగి కాల్ ఐ ఎస్ డీ ధరలు దిగివస్తాయని భావిస్తున్నారు.

Sunday, September 13, 2009

భలే పంచ్

రె౦టికి చెడ్డ రేవడిలా
మారిపోయి౦ది పాప౦..!!
వీరి పరిస్ధితి...

ఆరు నెలలు ఆగాల్సిందే


పెళ్ళిళ్ళ కోసం తొందరపడేవారికి ఇది పిడుగులాంటి వార్తే. నవంబర్ 14 నుంచి సుమారు ఆరు నెలలపాటు సుముహూర్తమే లేదు. మే 15 వరకు వివాహం, గృహప్రవేశం వంటి ఎలాంటి శుభకార్యాలూ జరుపుకోకూడదు. అంటే నవంబర్ 10 నుంచి మే మూడో వారం వరకు బాజా భజంత్రీలు మూగపోవాల్సిందే! ఈ ఏడాది నవంబర్ 14 నుంచే మంచి ముహూర్తాలు లేవని చాలామంది పంచాంగ కర్తలు చెబుతున్నారు. ఒకటి రెండు పంచాంగాల్లో మాత్రం పరిమితంగా కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. గ్రహస్థితుల కారణంగా మంచి లగ్నాలు లేవని పంచాంగ కర్తలు అంటున్నారు. విదేశాల్లో... ముఖ్యంగా అమెరికాలో ఉంటున్నవారికి డిసెంబర్‌లో క్రిస్మస్ సెలవులు వస్తాయి. ప్రవాస భారతీయులు సాధరణంగా నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే వివాహాది శుభకార్యాలు పెట్టుకుంటారు. ఎన్నారై సంబంధాలు చేసుకొనే వారికి, ముఖ్యమైన బంధువులు విదేశాల్లో ఉండే వారికి ఈ రెండు నెలలు ఎంతో అనుకూలం. ఈసారి ఈ రెండు నెలల్లో మంచి ముహూర్తాలు లేకపోవడంతో వాళ్ళు డీలాపడిపోతున్నారు. అలా అని ఊరుకోకుండా పంచాంగాలన్నీ తిరగేసి తమకు అనుకూలంగా ఏదో ఒక ముహూబర్తానికి ఓకే చెబుతున్నారు. ఐదారు మాసాలు పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలు లేకపోతే కోట్లాది రూపాయల వ్యాపారం ఏం కావాలి? అసలే ఆర్ధిక మాంద్యంతో వ్యాపారాలు సరిగా లేక తల్లడిల్లిపోతుంటే.. పులిమీద పుట్రలా ఇదేంటని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
రాష్ట్రంలోని కళ్యాణమంటపాల్లో ఏటా సుమారు 10 లక్షల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇక ఇళ్ళలో, గుళ్ళలో జరిగే వాటికి లెక్క లేదు. పెళ్ళిళ్ళ పేరిట మన రాష్ట్రంలో సుమారు 30 వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతాయని ఓ అంచనా. ఆరు నెలల పాటు పెళ్ళిళ్ళు లేకపోతే ఈ వ్యాపారం అంతా ఏం కావాలి? దుస్తుల నుంచి బంగారు వస్తువుల వ్యాపారం వరకూ అన్నీ డీలా పడిపోవడం ఖాయమని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పట్టువిడుపులు ప్రదర్శించి ముహూర్తాలు పెట్టేస్తే రాష్ట్రం కళకళలాడుతుంది కదా అని వ్యాపార వర్గాలు అంటుంటే... మౌఢ్యాలు, అధిక మాసాల్లో పెళ్ళిళ్ళు చేయలేం కదా అని పండితులు అంటున్నారు. ఇన్ని మాసాలు వివాహ ముహూర్తాలు లేకపోవడం చాలా ఇబ్బందికరం. ఇది పురోహితులకు గడ్డుకాలమే. పెళ్ళిళ్ళు లేకపోతే పురోహితుల ఆదాయంలో 60 శాతానికి పైగా గండి పడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పురోహితులకు ఇది పెద్ద దెబ్బ. ఏదైనాగానీ పురోహితులనుంచి బంగారం వ్యాపారులవరకూ అందరికీ ఆర్ధికంగా చాలా దెబ్బ.

వెంకటేశ్వర స్వామి ఆభరణాలు


శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆభరన్లూ చూడ లంటే త్రిపతి వేల్లనవసరం లేదు ....